వడగళ్ళు రచన -రావూరు
ఆమధ్య ఎక్కడో చదివాను ఒక జంట మొదటి రాత్రే తగవు లాడుకొని విడాకు లిచ్చుకొన్నారని. "ఆదిలో ఆనందం పోయిన కొద్దీ పోరు-అంతానికి అంతులేని వైరం. "అనే సామెత వుంది మనకి. పైన చెప్పిన జంట ఈసామెతను కూడా రూపు మాపి వేసారు.
నిజానికి ఆదిలో ఆనందం అనేది అనుభవించ వలసిన సుఖం. కొత్తలో దంపతులేమిటి,స్నేహితులేమిటి,పాలు పోసేవాళ్ళేమిటి,పని చేసేవాళ్ళెమిటి ,పక్క భాగం లో వాళ్ళేమిటీ -"ఏదో అదృష్టం వల్ల ఇలా దగ్గర అయినాం"- అన్నంతగా వ్యవహరిస్తారు. అసలా పలక రింపులేవేరు ఆప్యాయతలే వేరు .........ఇన్నాళ్ళూ ఎక్కడున్నామో?...వీరిప్పుడు కనిపించారు.ముందే కనిపిస్తే ఎంత హాయిగా గడి చేదో? అన్నంతగా ప్రవర్తిస్తారు.
సిగ్గులు,నిగ్గులు,మొగ్గులు-పొడి దగ్గులు
కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు పడుచు కత్తెలు ఎంతో నమ్రతగా వుంటారు.భర్తతో మాట్లాడడానికే సిగ్గు పడతారు.తమలో ఏవో అంతులేని నిగ్గులున్నయని చెప్పడానికిబదులు చేష్టల్లోకి దిగుతారు. ప్రతి విషయం లో మొగ్గు చూపడానికి ప్రయత్నిస్తారు. పలకరించడానికి భయమన్నట్లుపొడి దగ్గులతో భర్త దృష్టిని ఆకర్షించుకొంటారు.క్రమ క్రమంగా మారిపోతుందా స్వరూపం .జారిపోతుందా స్వభావం. కొత్తరూపం ధరిస్తారు.ఆమె సిగ్గు పడటం మానేస్తుంది. ఆమెను చేసుకొన్నందుకు భర్త సిగ్గు పడే పరిస్థితి కల్పిస్తుంది. ఆదిలో పొందిన ఆనందానికి బదులు అంతులేని చింతలోపదతాడు భర్త అనిపించుకొన్న అదృష్ట హీనుడు.
ఏ ఆఫీసుకో బయలుదేరి భర్త వీధిలోకి వచ్చిన తర్వాత భార్యకు ఏదో జ్ఞాపకం వచ్చి " ఏమండోయ్ !మిమ్మల్నే! ఏమిటి గొర్రెలాగా తలవంచుకుపోతారు వూరివెంట మీరు ---- ఊడలు దిగిన మర్రిచెట్టులా ఇంట్లో నేనూనా? పంచదార అయిపోయింది, చేతిసంచీ పట్టుకెళ్ళండి,మధ్యాన్నానికేలేదు......వంటిగంట కల్లా పంపాలి. "అని సంచీ ఆయనకో అర్ధ గజం దూరంలో పడేట్టూ గిరాటు వేయడం జరుగుతుంది. వీధి భాగవతం కూడా దేనికని ఆయనగారా సంచీపుచ్చుకొని ,అలాటి ఇల్లాల్ని బహూకరించినందుకు భగవంతుణ్ణి మెచ్చుకొని ఆయన గారు వెళ్ళి పోతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత "దీనికి సానతం బుధ్ధి చెప్పాలి" అని మాత్రం మనసులో సణుగుతూ వెడతాడు.
కాపరానికి వచ్చింది నెల క్రింద- కసిరి కొట్టేది రోడ్డు మీద
"కాపురానికి వచ్చి నెలా పదిహేను రోజులు కాలేదు అప్పుడే కసిరి కొడుతోంది మొగుణ్ణీ ,అందులో నడి రోడ్డూ మీద" అని పక్క ఇళ్ళవాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. కలిసి మెలిసి కాలం గడిపిన కొద్దీ మనస్సులు అర్ధం చేసుకోవడం, మమతలు వడపోసుకోవడం -అనుభవాలను గుండెల్లో రంగరించుకోవడం -ఆదర్శ జీవితంలో అడుగు పెత్తడం "జరుగుతుందంటారు పెద్దలు.ఆ సిధ్ధాంతాలు చాలావరకు తారుమారైనాయి....మగవాళ్ళు మాత్రం మారరూ !
"సాయంత్రం ఇంటికి వచ్చినప్పటి నుంచీ సమరం ప్రారంభం ....బయట తిరిగినంత సేపు చిరునవ్వులు గుమ్మరిస్తారు...ముంగిట్లో అడుగు పెట్టేసరికి ముఖం ముడతలు పడుతుంది....అసలదోరకం ఫోజు వస్తుంది.రోజూ చేసే సంసారమే గనక అలవాటు అయిపోయింది ంకానీ -కొత్తగా చూస్తే కోపంలో ఆ రూపం ఘోరమనుకోండి ......ఇంతా చేస్తే నే చేసిన నేరమేమిటో అర్ధం కాదు.!అని కొందరు ఇల్లాళ్ళు గొడవ పడుతూ వుంటారు.
ఒకాయన ఫించను పుచ్చునుకొని ఇంట్లోనే కుంటు కొంటూ తిరుగుతుతున్నాడు.ఓపిక తగ్గింది.వూపిరి హెచ్చింది.పది గంటల వేళ పంట్లాం వేసుకొని ఎక్కడో అక్కడ కొంత సేపు తిరిగిరాందే ప్రాణం వూరుకోదు.ఫలానా పని అనిగానీ చోటు అని కూడా విండదు కనుక -- ఎప్పుడు వచ్చేదీ ఆయనకు తెలియదు.ఒక్కొక్క రోజు రెండింటికి వచ్చి తిండి తినడం జరిగేది.
అత్తిసరు నేవేస్తా!పచ్చడి నువ్వు నూరుకో!
" ఆయన భార్యను బ్రతిమాలాడూ,కాస్త పది దంటలకే అన్నం పెట్టు-నీకు పుణ్యం వుంటుంది. ఆకలితొ తిరగ లేకుండా వున్నాను."అని ఆవిడ వెంటనే జవాబు చెప్పింది - ఇప్పటికి నలభై ఏళ్ళనుంచి ,తెల్లరి లేచినప్పటినుంచీ పొయ్యి దగ్గర పొగలో పడి చాకిరీ చేసి పదింటికల్లా వడ్డించాను.ఇక నా వల్ల కాదు.వూరికేవున్న మనిషి వూరంతా తిరగడమెందుకు? నన్ను ఉరుకులూ పరుగులూ తియ్యమనడమెందుకు ?నావల్లకాదు మహాప్రభో!.....వంటి గంటకు వండి పెడితే గొప్ప.అంది
ఓపిక విండటం లేదే!ఏదో పచ్చడి మెతుకులన్నా పెట్టవే! ఫినను దారుడికి అంతకన్నా ఎక్కువేమి పెడతావు?"అని ఆయన అభ్యర్ధన.
' మీకు ఓపిక తగ్గితే నాకు మాత్రం తగ్గదా?నేనేమి పాషాణాన్నా!పచ్చడి మెతుకులు పెట్టడం మాత్రం తేలికేమిటి? పోనీ అత్తెసరు నేను పడేస్తాను....ఆ పచ్చడేదో మీరే నూరుకోండి. ...తినండి."అని ఆవిడగారి సలహా...
ఒకప్పుడు ఆవిడ సిగ్గులు ఒలక బోసి వుంటుంది.నిగ్గులు చూపించి వుంటుంది.ఆయన చూచిన ప్రతి చూపుకి మొగ్గి వుంటుంది. కాలం గదిచిన కొద్దీ అలా మారింది...ఈ తగవులో తప్పెవరిదో,ఒప్పెవరిదో -తీర్పు చెప్పడం కష్టం .నేర్పుతో నిభాయించుకు రావడమొక్కటే మార్గం.
వాడితో కాపురం కన్నా వల్లకాటికి చేరడం మంచిది
మా వూళ్ళో ఒక రైతు కుమార్తె వుండేది. ఆ అమ్మాయిని కోరికోరి వూళ్ళోనే వున్న మేనమామ కిచ్చి వివాహం చేసారు.ఆ అల్లుడు చాలా సమర్ధుడు.మాటకారి మంచి నేర్పరి. అయితేనేం పెళ్ళయిన ఆరు నెలల తరువాత ఆ అమ్మాయి అతడంటే ఇష్తం లేదని చెప్పి వచ్చి పుట్టింట్లో కూర్చోవడం ప్రారంభించింది.
ఎవరైనా సలహా చెప్ప డానికి వెడితే -మీరు చెప్పడం అనవసరం -వాడితో కాపురం కంటే వల్లకాటికి చేరడం సుఖం .......అవస్థలు పడేదానికి నాకు తెలుసా? మీకు తెలుసా వాడి సంగతి? అని ప్రశ్నించేది.వచ్చిన వాళ్ళు ఏమి చెప్పాలో తెలియక వెళ్ళీ పోయే వారు.
వూరి మధ్యలో గల గుడి దగ్గర నిలబడి" స్వామీ! వాణ్ణి తెచ్చి కట్టిన వాడివి నువ్వు కనుక నీకు చెపుతున్నా,వాడితో నే కాపురం చెయ్యలేను.....ఎందుకింత ఘట్టిగా చెపుతున్నానో నువ్వు గ్రహించు.....కావాలంటే వాణ్ణి పిలిచి నువ్వు అడుగు "అని ఏమేమో చెపుతూ వుండేది. ఏదో చెప్పరాని బాధలు పడుతోందని కొంద్రూ,మతి చెడిందని కొందరు నిర్ణయించుకొని వూరుకొన్నారు.
విచిత్ర మేమిటంటే....ఆరుగురు బిడ్డల తల్లి అయేదాకా ఆవిడైలా వాడితో కాపురం చెయ్యనని చెపుతూనే వుండేది. దానికి తగ్గట్టు ఎక్కువగా పుట్టింటి వద్దే కాలక్షేపం చేస్తూ వుండేది. దాంపత్యాలలో "వైరానికి" సంబంధించిన ఒక విచిత్ర ఊదంత మిది.
అది మేం బతికి వున్నప్పటి ఫొటో
ఒక రింటికి వెడితే గోడమీద వున్న దంపతుల ఫొటో చూపించిందా ఇల్లాలు.ఎంతో అందం గా వున్నారని సంతోషించా. వెంఠనే ఆవిడ అన్నది "అది మేం బతికి వున్నప్పటి ఫొటో అని. మరి ఆదాంపత్యమెలా మారిపోయిందో,ఆమె ఎలాటి స్థితి లో కాపురం చేస్తొందో తెలుస్తుందామె మాటవల్ల .
28-8-76